నాబార్డ్ మాజీ ఛైర్మన్ పామిడి కోటయ్య కన్నుమూత
బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలకు
రుణ,బ్యాంకింగ్ రంగానికి తీరని లోటు...
ఐదు దశాబ్దాల సేవలందించిన నిపుణుడు
హైదరాబాద్:
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) మాజీ ఛైర్మన్, ప్రముఖ బ్యాంకింగ్ నిపుణుడు డాక్టర్ పామిడి కోటయ్య (85) బుధవారం రాత్రి హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. నిరాడంబర రైతు కుటుంబంలో జన్మించిన కోటయ్య, తన ప్రతిభతో బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.
ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను ప్రథమ శ్రేణిలో, స్వర్ణ పతకంతో పూర్తి చేసిన కోటయ్య, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) పట్టా అందుకున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్లో అసోసియేట్గా అర్హత సాధించిన ఆయనకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) గౌరవ ఫెలోషిప్ను ప్రదానం చేసింది.
1961లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన కోటయ్య, 1982లో నాబార్డ్లో చేరారు. 1990 నుంచి 1992 వరకు మేనేజింగ్ డైరెక్టర్గా, ఆ తర్వాత 1992 నుంచి 1998 వరకు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, రెగ్యులేటరీ వ్యవస్థలు, నిర్వహణ, ఆర్థికాభివృద్ధి, కార్పొరేట్ గవర్నెన్స్ రంగాల్లో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం గడించిన ఆయన, 1980 నుంచి 2010 వరకు ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడీ) వంటి బహుళజాతి ఆర్థిక సంస్థలకు సలహాదారుగా సేవలందించారు.
నాబార్డ్ అనంతరం కూడా కోటయ్య పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఎన్ఎస్ఎల్ షుగర్స్, నూజివీడు సీడ్స్ వంటి కార్పొరేట్ సంస్థల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్గా, ఛైర్మన్గా సుదీర్ఘకాలం సేవలందించారు. లాంకో గ్రూప్నకు చెందిన పలు విద్యుత్ సంస్థల్లోనూ డైరెక్టర్గా వ్యవహరించారు.
కోటయ్య మృతి పట్ల బ్యాంకింగ్, వ్యవసాయ ఆర్థిక రంగాలకు చెందిన పలువురు నిపుణులు, ఆయనతో అనుబంధం ఉన్న సంస్థల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.