రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి
సీఎం రేవంత్
ఢిల్లీ, జూలై 28: రాజకీయాల్లో నైతికతకు ప్రతీకగా కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి నిలిచారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి చివరి శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని అన్నారు. తన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో ప్రజల్లోనే కాకుండా పార్లమెంట్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
జైపాల్ రెడ్డి ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.