గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగిస్తాం
ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు: గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించే పనుల్లో జాప్యం జరుగుతుండటంపై రైతుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టత ఇచ్చారు. పనుల్లో నెలకొన్న జాప్యానికి ఎలాంటి నిర్లక్ష్యం కారణం కాదని, కేవలం సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం జరుగుతోందని ఆయన వివరించారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనలు, సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రైతులు, రైతు సంఘం ప్రతినిధి డాక్టర్ కొల్లా రాజమోహన్ రావుకు ఎమ్మెల్యే ఏలూరి విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్క రైతుకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన దిశగా అధికార యంత్రాంగం మరింత వేగంగా, సమన్వయంతో పని చేస్తుందని చెప్పారు. ఛానల్ పొడిగింపు పనులు పూర్తయితే పర్చూరు పరిధిలోని అనేక గ్రామాల్లో దీర్ఘకాలంగా ఉన్న సాగునీటి, తాగునీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
రైతులతోపాటు డాక్టర్ రాజమోహన్రావు కూడా ఎమ్మెల్యే ఏలూరికి కీలక విజ్ఞప్తి చేశారు. పనుల్లో నెలకొన్న సాంకేతిక ఆటంకాలను అధిగమించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా ఈ వ్యవహారంపై దృష్టి సారించి, పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఏలూరి పునరుద్ఘాటించారు.