క్రోటన్ "ఉబ్బలమడుగెన్సిస్" తూర్పు కనుమల్లో కొత్త వృక్ష జాతికి
పవన్కళ్యాణ్ నామకరణం
1 / 2
తిరుపతి, జూలై 29: తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన అరుదైన వృక్ష జాతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్కళ్యాణ్ నామకరణం చేశారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ కొత్త జాతికి "క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్" అని పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండలు ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ఈ పేరు ఖరారు చేసినట్లు అటవీ శాఖ వెల్లడించింది. సుగంధభరితమైన ఆకులతో ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ మొక్క లక్షణాలు ఉప ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నాయి.
ప్రధాన అటవీ సంరక్షణాధికారి పి.వి. చలపతిరావు నేతృత్వంలో పరిశోధక బృందం తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ కొత్త జాతిని గుర్తించింది. సన్నిహిత జాతి క్రోటన్ అరోమాటికస్తో పోలిస్తే, నిర్మాణం, పునరుత్పత్తి లక్షణాల్లో ఇది స్పష్టమైన భేదాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపించడం, సహజ ఆవాసాలపై పెరుగుతున్న ముప్పు దృష్ట్యా ఈ జాతిని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నదిగా పరిశోధకులు వర్గీకరించారు.
ఈ ఆవిష్కరణ తూర్పు కనుమల జీవ వైవిధ్య సంపదను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని, ఈ ప్రాంతంలో మరింత లోతైన శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, రాష్ట్ర సహజ వారసత్వ సంపద పరిరక్షణ పట్ల తమ నిబద్ధతకు ఈ ఆవిష్కరణ నిదర్శనమని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.